మా సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం?

దేశ ప్రజలంతా వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారు.. ప్రధాని మోడిపై రాహుల్ ఫైర్

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రధాని మోడి నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి స్పందన వెలువడలేదు. ఈ నేపథ్యంలోమోడిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో జవాన్లు అమరులు అయినప్పటికీ ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఆయన ఏదో దాస్తున్నారు? జరిగిందేమిటో అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. మా సైనికులను చంపడానికి, మా భూభాగాన్ని ఆక్రమించడానికి చైనాకు ఎంత ధైర్యం’ అని రాహుల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ట్వీట్ తర్వాత ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు. చైనాతో ఘర్షణ సందర్బంగా అమరులైన జవాన్లకు రాహుల్ సంతాపం ప్రకటించారు. మోడి బయటకు వచ్చి నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. 20 మంది ప్రాణాలను చైనా బలికొందని… మన భూభాగాన్ని ఆక్రమించుకుందని… అయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోడిని నిలదీశారు. యావత్ దేశం మీ వెనకే ఉందని… భయపడాల్సిన అవసరం లేదని… నిజాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/