ఇస్రోకు 1.2 బిలియన్‌ డాల‌ర్ల జరిమానా

అమెరికా కోర్టులో ఇస్రో వ్యాపార విభాగం యాంత్రిక్స్‌కు ఎదురుదెబ్బ

ISRO

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అమెరికా న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార విభాగమైన యాంత్రిక్స్‌ కార్పోరేషన్‌ ఇప్పుడు 1.2 బిలియన్‌ డాలర్లు(రూ.8.9వేల కోట్లు) పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2005లో యాంత్రిక్స్‌ సంస్థ దేవాస్‌ మల్లీమీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. కానీ ఆ ఒప్పందాన్ని 2011లో యాంత్రిక్స్ ర‌ద్దు చేసింది. దీని ప‌ట్ల దేవాస్ మ‌ల్లీమీడియా కోర్టుల‌ను ఆశ్ర‌యించింది. ఈ కేసులో భార‌త సుప్రీంను ఆశ్ర‌యించిన దేవాస్‌కు ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అయితే తాజాగా సియాటిల్‌లోని వాషింగ్ట‌న్ జిల్లా కోర్టు జ‌డ్జి థామ‌స్ జెల్లీ ఈ కేసులో అక్టోబ‌ర్ 27వ తేదీన తీర్పు వెలువ‌రించారు. దేవాస్‌కు 56.2 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా చెల్లించాల‌ని, వ‌డ్డీతో క‌లిపి మొత్తం న‌ష్ట‌ప‌రిహారం 102 కోట్ల డాల‌ర్లు చెల్లించాలంటూ సియాటిల్ కోర్టు త‌న తీర్పులో యాంత్రిక్స్‌ను ఆదేశించింది. అయితే కోర్టు ప‌రిధి అంశంలో దేవాస్‌, యాంత్రిక్స్ మ‌ధ్య విభేదాలు ఉన్నా.. అమెరికాలోనూ కోర్టు కేసును వాదించే హ‌క్కు ఉన్న‌ట్లు గ‌తంలో దేవాస్ పేర్కొన్న‌ది. యాంత్రిక్స్ కార్పొరేష‌న్‌కు సియాటిల్‌లో ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న‌ది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/