బిజెపిలో చేరడం లేదన్న సచిన్‌ పైలట్‌ !

నేడు ఎంఎల్ఏలతో అశోక్ గెహ్లాట్ సమావేశం

Sachin pilot
Sachin pilot

జైపుర్‌: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, అనూహ్యంగా కీలక ప్రకటన చేశారు. తాజాగా, తానేమీ బిజెపిలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి జైపూర్ లో నేడు సీఎం, ఎమ్మెల్యేల సమావేశం జరిగే సమయానికి, సచిన్ పైలట్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావాల్సివుంది. అయితే, కొద్దిసేపటిక్రితం ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన, పార్టీని వీడబోవడం లేదని వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నబిజెపి అధిష్ఠానం వేచి చూసే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, తామేమీ కాంగ్రెస్ ను చీల్చాలని భావించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సచిన్ సన్నిహిత వర్గాలు కూడా బిజెపితో సంబంధాలపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. సచిన్ పైలట్ కు సీఎం అశోక్ గెహ్లాట్ తో విభేదాలు ఉన్నాయని, రాష్ట్రంలో తనకు తగినంత ప్రాతినిధ్యాన్ని ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నారని, ఆయన బిజెపిలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని బిజెపి సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/