కరోనా నియంత్రణకు రూ.500 కోట్లు
అసెంబ్లీ సమావేశాలు కుదింపు
బోర్డు పరీక్షలు యధాతథం
ఎవరూ జనసమూహాల్లోకి వెళ్లొద్దు
మ్యారేజ్ హాళ్ల బుకింగ్స్ రద్దు : కేబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అత్యవ సరంగా రూ.500 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధ్వర్యంలో ఈ నిధుల విడుదల జరగనుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తూ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో మూడు,నాలుగు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను టిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీడియాకు వెల్లడించారు.
కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలను ఖరారు చేస్తూ రెండు రకాల కార్యాచరణను ఖరారు చేశారు. మొదటి దశలో కొన్ని అంశాల్లో మార్చి 31 వరకు,కొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పడింది. దీంతో అసెంబ్లీ సమావేశాలను 16వ తేదీన ముగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమై పరిస్థితులను వివరించారు. దీంతో స్పీకర్ సమావేశాలను కుదించాలని నిర్ణయానికి వచ్చారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/