ముస్లిం కరోనా రోగులకు రంజాన్ స్పెషల్ ఫుడ్
తెలంగాణ సిఎం కేసిఆర్ ఆదేశం
Hyderabad: ముస్లిం కరోనా రోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంజాన్ స్పెషల్ ఫుడ్ అందించాలని ఆదేశించారు.
రంజాన్ రోజుల్లో ముస్లింల ఇళ్లల్లో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండే వారికి రంజాన్ స్పెషల్ ఫుడ్ను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉపవాస దీక్ష ఆరంభానికి ముందు.. విరమించిన తరువాత వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన స్పెషల్ భోజనాన్ని వడ్డించబోతోంది.
శనివారం నుంచి ఈ రంజాన్ మెనూ అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ బారిన పడిన ముస్లిం పేషెంట్లు తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఉపవాస దీక్షను ఆరంభిస్తుంటారు.
ఆ సమయంలో వారికి షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందిస్తారు. సాయంత్రం ఉపవాస దీక్షను విరమించే సమయంలో ఇఫ్తార్గా ఖిచిడి, చికెన్ కర్రీ, బగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అందిస్తారు.
మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వడ్డిస్తారు. అలాగే ఉపవాస దీక్షను విరమించిన తరువాత అల్పాహారంగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందిస్తారు.
ఈ నెల రోజులూ ఇదే రకమైన ఆహారాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/