ఆయుర్వేద బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ

Rajya Sabha passes Institute of Teaching and Research in Ayurveda Bill

న్యూఢిల్లీ: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈరోజు ఆయుర్వేద బిల్లుపై వివిధ పార్టీల ఎంపిలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. బిల్లుపై మాట్లాడిన ఎంపిల‌కు ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ థ్యాంక్స్ చెప్పారు. ఆధునిక వైద్యంలో డాక్ట‌ర్ అయినా.. ఆయుర్వేదంతో పాటు ఇత‌ర సాంప్ర‌దాయ వైద్య విధానాల‌ను తాను ప్ర‌శంసిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. జామ్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఇన్స్‌టిట్యూట్‌కు సంబంధించి మంత్రి క్లారిటీ ఇచ్చారు.

దేశంలోని ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా గౌర‌వం ఇస్తున్నామ‌న్నారు. జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన ఆరోగ్య సంస్థ‌లు దేశంలో 103 ఉన్నాయ‌ని, కానీ ఆయుర్వేద‌కు ఏదీ లేద‌ని ఆయ‌న తెలిపారు. జామ్‌న‌గ‌ర్ ఆయుర్వేద కాలేజీకి జాతీయ హోదా ఇవ్వ‌డంలో ప‌క్ష‌పాతం లేద‌న్నారు. జామ్‌న‌గ‌ర్‌లో ఉన్న ఇన్స్‌టిట్యూట్ చాలా పురాత‌న‌మైన‌ద‌ని, దాన్ని ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేసింద‌న్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న ఆయుర్వేద సంస్థ అది ఒక్క‌టే అన్నారు. జామ్‌న‌గ‌ర్ ఇన్స్‌టిట్యూట్ ఈ హోదాకు త‌గిన‌ద‌ని, మిగితా సంస్థ‌లు కూడా అప్‌గ్రేడ్ అయిన త‌ర్వాత వాటికి కూడా జాతీయ ప్రాముఖ్య‌త క‌ల్పిస్తామ‌ని మంత్రి తెలిపారు. మూజువాణి ఓటు ద్వారా ఆయుర్వేద బిల్లును పాస్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/