అసెంబ్లీలో అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం
పంజాబ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్లో తీవ్ర ఆందోళన జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది. కేంద్ర అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ కెప్టెన్ అమరీందర్ సింగ్ రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు రెండు రోజు సందర్భంగా.. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆయన మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్రం తెచ్చిన మూడు అగ్రి చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని తన తీర్మానంలో సిఎం అమరీందర్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సవరణ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని, ఈ చట్టాలు పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ మూడు చట్టాలను ఏకపక్షంగా సభ వ్యతిరేకిస్తున్నట్లు అమరీందర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బిల్లుల స్థానంలో పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త బిల్లులను సిఎం అమరీందర్ సభలో ప్రవేశపెట్టారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/