పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర
ఉగ్రదాడిని భగ్నం చేసిన భద్రతా బలగాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఈ కుట్రలో లష్కరే, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 కిలోల ఐఈడీతో ఓ కారులో ఈ రోజు ఉదయం ఉగ్రవాది వెళ్తుండగా భద్రతా బలగాలు ఆ కారును ఆపి సోదాలు చేయాలనుకున్నాయి. అయితే, కారు నడుపుతున్న ఉగ్రవాది బారికేడ్లపైకి దూసుకెళ్లి కారుతో పాటు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో కారును అక్కడే వదిలేసి ఉగ్రవాది పారిపోయాడు.
ఉగ్రదాడి జరిగే అవకాశముందని అంతకు ముందే భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి హెచ్చరిక వచ్చింది. దీంతో అప్రమత్తమై నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కారులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అయితే, ఆ సమయంలో పేలుడు సంభవించి కొద్దిగా నష్టంవాటిల్లింది. పస్తుతం ఉగ్రవాది కోసం ఆర్మీ, పోలీసు సిబ్బంది సోదాలు ప్రారంభించాయి. కాగా 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/