పాకిస్థాన్‌లో నిర్బంధం చేస్తే ఆకలి చావులే

కరోనా వైరస్‌..ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల వంటివి మూసివేశాం

Imran-Khan
Imran-Khan

ఇస్లామాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచా దేశాలను గడగడలాడిస్తుంది. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఇప్పటికే పలు దేశాలు నిర్బంధంలో ఉన్నాయి. అయితే తాము అలా చేయలేమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నిర్బంధాలను భరించే స్థితిలో తమ దేశం లేదని చెప్పారు. అలాగైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు వివిధ దేశాలు అవలంబిస్తున్న తరహాలో నగరాల నిర్బంధాన్ని పాకిస్థాన్ అమలు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఆ ప్రతిపాదనలను తమ దేశ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే జనం ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధం విధిస్తే ప్రజలు ఆకలితో మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, క్రీడా ప్రాంగణాలు మూసివేశామని చెప్పారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు రెండు వందల మందికిపైగా వైరస్ సోకింది. సుమారు రెండు వేల మంది వరకు ఐసోలేషన్లలో ఉన్నారు. అయితే తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్థాన్ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో లేదు. ఇప్పటికే అమెరికా, చైనా, ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో పరిస్థితిని వెల్లదీస్తోంది. ఇప్పుడు కరోనా దెబ్బ ఎలా ఉంటుందన్నది ఆందోళన కరంగా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/