కరప్షన్‌, కుటుంబం, కులం రాజకీయ సమస్యల్లో ఏపి

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2.70 చొప్పున యూనిట్ విద్యుత్ కొంటున్న ఏపి ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 9 వసూలు చేస్తున్నట్టు నాకు తెలిసింది.

Union Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: మోడి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బిజెపి ఏపి శాఖ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీని ఉద్దేశించి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి నిర్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఏపి ప్రభుత్వం పలు ఒప్పందాలను రద్దు చేయడంపై మాట్లాడుతూ.. కరప్షన్, కుటుంబం, కులం లాంటి రాజకీయాల్లో చిక్కుకుని ఏపి కష్టాలు పడుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏడీబీలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకుని చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల అమలులో ఇబ్బంది కలిగిస్తే అవి పూర్తికావడం చాలా కష్టమన్నారు. కారణాలు ఏవైనా ఒప్పందాలను రద్దు చేసినట్టు ప్రకటిస్తే దేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని నిర్మల సూచించారు. పెడధోరణులకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు ఊరూరా పోరాడాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2.70 చొప్పున యూనిట్ విద్యుత్ కొంటున్నఏపి ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 9 వసూలు చేస్తున్నట్టు తనకు తెలిసిందన్నారు. లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌లోకి అడుగుపెట్టిన ఇలాంటి సమయంలో రూ.9తో యూనిట్ విద్యుత్ కొని వ్యాపారాలు నడపడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఆర్థిక సమస్యల పరిష్కారానికే ఆత్మనిర్భర్ ప్యాకేజీలో రూ.90 వేల కోట్లు ప్రకటించినట్టు చెప్పారు. మత్స్య సంపద యోజన కింద రూ. 20 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కోవిడ్‌పై పోరుకు ఏపికి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.8,025 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుత కష్టకాలంలో ఏ రాష్ట్రానికి కొరత లేకుండా చేసినట్టు చెప్పారు. అలాగే, ఏపికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.39.41 కోట్ల కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని, నిర్మాణ రంగ కార్మికులకు కన్‌స్ట్రక్షన్ ఫండ్ నుంచి రూ.196 కోట్లు ఇచ్చామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, వలస కార్మికుల తరలింపునకు మూడు శ్రామిక్ రైళ్లను తరలించినట్టు నిర్మల వివరించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/