వరుసగా తొమ్మిదో ఏడాదీ తొలి స్థానంలో ముకేశ్‌

రూ. 6.58 లక్షల కోట్లకు అంబానీ సంపాదన

Mukesh-Ambani

ముంబయి: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితను విడుదల చేసింది. ఇందులో భారతీయుల్లో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వరుసగా తొమ్మిదో సంవత్సరం తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది ముఖేష్ ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే, రూ.2.77 లక్షల కోట్ల నుంచి, రూ.6.58 లక్షల కోట్లకు పెరిగింది. ఇటీవలి కాలంలో రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ తదితర కంపెనీల్లోకి భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరిగిపోయింది. కాగా ముఖేష్‌ అంబానీ గంటకు ప్రతి గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడించింది.

ఇక, తమ అధ్యయనంలో భాగంగా ఐఐఎల్ఎఫ్, ఇండియాలో రూ. 1000 కోట్లకు మించి సంపదను కలిగివున్న 828 మంది ఆస్తులను పరిశీలించింది. వారిలో 627 మంది ఆస్తులు గడచిన ఏడాది వ్యవధిలో పెరిగాయని, 229 మంది సంపద మాత్రం తగ్గిందని తెలిపింది. ఈ జాబితాలోకి కొత్తగా 162 మంది రాగా, 2019లో చోటు దక్కించుకున్న వారిలో 75 మంది ఈ ఏడాది బయటకు వెళ్లిపోయారని ఐఐఎల్ఎఫ్ తెలిపింది. ఇక మహిళల విషయానికి వస్తే, స్మితా వీ కృష్ణ రూ. 32,400 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. మొత్తం జాబితాలో ముఖేష్ తరువాత హిందుజా సోదరులు, శివనాడార్, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్ జీ, సైరస్ పూనావాలా, దాధాకిషన్ దమానీ, ఉదయ్ కోటక్, దిలీప్ సంఘ్వీ, సైరస్ పల్లోంజీ మిస్త్రీలున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/