నేటి నుంచి బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్!

బెంగళూరు, దానిని ఆనుకుని ఉన్న జిల్లాలలో పూర్తిస్థాయి లాక్‌డౌన్

bengaluru-lockdown

బెంగళూరు : భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి దేశంలోని అనేక నగరాల్లో లాక్‌డౌన్‌ మళ్లీ అమలు చేయబడుతోంది. నేటి సాయంత్రం నుంచి ఈనెల 22 వరకు రాజధాని బెంగళూరుతోపాటు దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు, కిరాణా దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కర్ణాటకలో నిన్న ఒక్క రోజే 2,738 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 41,581కి పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 25 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడులోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న 4,328 కేసులు నమోదు కాగా, 66 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా ‌తో మృతి చెందిన వారి సంఖ్య 2,032కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 1,42,798 కేసులు నమోదు కాగా, వీటిలో 90 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/