ఢిల్లీ హైకోర్టులో జేఎన్యూ ప్రొఫెసర్లు పిటిషన్
న్యూఢిల్లీ: జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 5న క్యాంపస్లో చోటుచేసుకున్న హింసాకాండ తాలూకు సీసీటీవీ ఫూటేజీలను భద్రపర్చాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు మరో మూడు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. తాజాగా అందిన మూడు ఫిర్యాదులతో కలిపి ఢిల్లీ పోలీసులకు అందిన ఫిర్యాదుల సంఖ్య 14కి చేరినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం చోటుచేసుకున్న ఘర్షణల తాలూకు వీడియోలతో తమకు ఫిర్యాదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 12 మంది వచ్చి పోలీసులకు తమ వాంగ్మూలాలను రికార్డు చేశారు. కాగా దాడిలో గాయపడిన విద్యార్థులతో కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు మాట్లాడనున్నట్టు చెబుతున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/