ఆమెకు ఎంతో ఓర్పు, ప్రేమ ఉన్నాయి
బీహార్ బాలిక జ్యోతి కుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: కరోనా లాక్డౌన్ కారణంగా అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసించారు. బీహార్లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తుండగా లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు రావడంతో సొంతూరికి వెళ్లే క్రమంలో గాయపడ్డాడు. దీంతో తండ్రిని సైకిల్ ఎక్కించుకుని ఆమె సొంతూరికి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఇవాంక.. ’15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్పై కూర్చోబెట్టి 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఎంతో ఓర్పు, ప్రేమతో ఆమె చేసిన ఈ అద్భుతమైన పని భారతీయ ప్రజలు, సైకిల్ ఫెడరేషన్ను ఆకర్షించింది’ అని ఆమె తెలిపింది. కాగా, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతి ప్రతిభను ప్రశంసించి, సైక్లింగ్ ట్రయల్స్కు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. ఆమె ట్రయల్స్లో ఎంపికైతే, ట్రైనీగా అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆమెకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/