ఇన్ఫోసీస్‌ దూకుడు..గంటలో రూ. 50 వేల కోట్ల లాభం

గత సంవత్సరంతో పోలిస్తే 8.5 శాతం పెరిగిన ఆదాయం

INFOSYS

ముంబయి: స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ ఈక్విటీ వాటా ఆకాశానికి ఎగసింది. 2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే, ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సంస్థ ప్రకటించగా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. దీంతో సెషన్ ఆరంభంలోనే ఇన్ఫోసిస్ రికార్డు స్థాయి లాభాలను నమోదు చేయగా, గంట వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ.50 వేల కోట్లకు పైగా లాభపడ్డారు. ఇన్ఫీ ఈక్విటీ విలువ ఏకంగా 15 శాతం పెరగడం గమనార్హం. కాగా, జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్ 11.5 శాతం నెట్ ప్రాఫిట్ వృద్ధిని నమోదు చేసి రూ. 4,233 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం సంస్థ నికరలాభం రూ. 3,798 కోట్లు మాత్రమే. ఇక, కొత్తగా 1.74 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ ను సంస్థ కుదుర్చుకుంది. కన్సాలిడేటెడ్ విధానంలో ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 8.5 శాతం పెరిగి రూ. 21,803 కోట్ల నుంచి రూ. 23,665 కోట్లకు పెరిగిందని సంస్థ పేర్కొంది. కాగా, యూఎస్ డాలర్ తో మారకపు విలువతో పోలిస్తే, రూపాయి నష్టాలు కూడా ఇన్ఫోసిస్ గణాంకాలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపాయి. అందుకే రూపీ టర్మ్స్ లో సంస్థ గణాంకాలు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/