ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది ఎంతమంది పుట్టారో తెలుసా..

చైనాను దాటేసిన ఇండియా

babies
babies

ఐరాస: కొత్త ఏడాది తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది జన్మించారని, ఇందులో అత్యధికులు ఇండియాలోనే పుట్టారని ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఏజెన్సీ యునిసెఫ్ (UNICEF-యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్) వెల్లడించింది. మొత్తం 3,92,078 మంది జనవరి 1న జన్మించారని, అందులో 67,385 మంది ఇండియాలో పుట్టారని పేర్కొంది. జననాల విషయంలో అత్యధికంగా జనాభా ఉన్న చైనాను భారత్ అధిగమించిందని, చైనాలో న్యూ ఇయర్ ఫస్ట్ డేన 46,299 మంది పుట్టారని పేర్కొంది. ఫిజీలో 2020 సంవత్సరపు తొలి బేబీ జన్మించిందని వెల్లడించిన యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోరే, మొత్తం జననాల్లో సగం మంది ఎనిమిది దేశాల్లోనే పుట్టారని వెల్లడించారు. ఇండియా, చైనాలతో పాటు నైజీరియా (26,039), పాకిస్థాన్ (16,787), ఇండోనేషియా (13,020), యూఎస్ఏ (10,452), డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10,247) ఇథియోపియా (8,493) జననాలను చూశాయని తెలిపారు.

గత సంవత్సరం జన్మించిన చిన్నారుల్లో 25 లక్షల మంది పుట్టిన నెల రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారని, నెలలు నిండకుండానే పుట్టడం, డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, ఇన్ఫెక్షన్లు సోకడం ఇందుకు కారణమని హెన్రిటా ఫోరే తెలియజేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో చిన్నారుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని ఆయన తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/