లడఖ్‌ వద్ద పరిస్థితిపై లోక్‌సభలో మంత్రి ప్రకటన

rajnath-singh

న్యూఢిల్లీ: భారత్‌ చైనా సరిహద్దు లడఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే ఉంటార‌ని ప్ర‌ధాని మోడి ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇటీవ‌లే తాను ల‌డాఖ్ వెళ్లిన‌ట్లు చెప్పిన ర‌క్ష‌ణ మంత్రి.. సైనికుల‌ సాహ‌సం, శౌర్యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని, క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవ‌లో ప్రాణ‌త్యాగం చేశార‌న్నారు. లడఖ్‌లో 1962లో చైనా వేల కి.మీల భారత భూభాగాన్ని డ్రాగన్‌ ఆక్రమించిందని సభకు వెల్లడించారు. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదాలు ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 1950 నుంచి రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న‌ద‌ని, కానీ ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయాయ‌న్నారు. ఇదో సంక్లిష్ట‌మైన స‌మ‌స్య అన్నారు. శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వాస్త‌వాధీన రేఖ వెంట శాంతి, సామ‌ర‌స్యం ముఖ్య‌మ‌ని మంత్రి రాజ్‌నాథ్ అభిప్రాయ‌పడ్డారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్లో అభివృద్ధి జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు.

స‌రిహ‌ద్దు వెంట ఉన్న సున్నితత్వాన్ని స‌భ అర్థం చేసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. సైనిక ద‌ళాల త్యాగాల‌ను ప్ర‌శంసించాల‌న్నారు. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రిహ‌ద్దుల్లో మౌళిక స‌దుపాయాల‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చైనా ద‌ళాలు హింసాత్మ‌క ధోర‌ణితో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో భార‌త్ కూడా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. స‌రిహ‌ద్దును ర‌క్షించుకునేందుకు సైనిక ద‌ళాలు స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. సైనిక ద‌ళాల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుత ద‌శ‌లో చాలా సున్నిత‌మైన అంశాలను వెల్ల‌డించ‌లేమ‌ని రాజ్‌నాథ్ తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/