నిషేధంపై స్పందించిన టిక్టాక్
నిబంధనలన్నీ పాటిస్తున్నాం.. టిక్ టాక్ యాజమాన్యం
న్యూఢిల్లీ: టిక్ టాక్ తో పాటు మరో 59 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది. డేటా ప్రైవసీ, సెక్యూర్టీ విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు టిక్టాక్ ఇండియా పేర్కొన్నది. భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇతర విదేశీ ప్రభుత్వాలతో షేర్ చేసుకోలేదని చెప్పింది. చైనా ప్రభుత్వానికి కూడా తమ సమాచారాన్ని ఇవ్వలేదన్నది. ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో సమాచారం కోరినా.. దాన్ని మేం వ్యతిరేకిస్తామని టిక్టాక్ తెలిపింది. యూజర్ ప్రైవసీ, సమాచారానికి అత్యున్నత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు టిక్టాక్ ఇండియా తెలిపింది. టిక్టాక్ను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఆ అంశంపై భారత ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఆహ్వానం వచ్చినట్లు కూడా ఆ సంస్థ పేర్కొన్నది. యాప్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం అందిందని, వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తమను కోరినట్లు టిక్టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు సహా ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులే అన్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/