తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు మద్యం దుకాణాలు మూసేయండి

Madras High Court

తమిళనాడు: తమిళనాడు ఈ నెల 7 నుంచి మద్యం దుకాణాలు తెరవడంతో మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించక, పెద్ద ఎత్తున బారులు తీరారు. అయితే, మద్యం దుకాణాలు తెరవగానే జనం పెద్ద ఎత్తున బారులు తీరడం, భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పళనిస్వామి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చని పేర్కొంటూ జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మద్యం దుకాణాలను తెరవబోతున్నట్టు ఈ నెల 4న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు మద్యం అమ్మకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/