సింధియాకు షాకిచ్చిన కాంగ్రెస్‌

ఫోర్జరీ కేసును మళ్లీ ఓపెన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

jyotiraditya-scindia
jyotiraditya-scindia

మధ్యప్రదేశ్‌: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సింధియాపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోజు వ్యవధిలోనే చర్యలకు దిగింది. గతంలో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఉన్న ఫోర్జరీ కేసును మళ్లీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మిన సందర్భంగా వారు తప్పుడు పత్రాలను సృష్టించారనే కేసు వారిపై 2014లో నమోదైంది. ఈ సందర్భంగా ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ కేసును రీ ఓపెన్ చేసిన విషయం నిజమేనని చెప్పారు. సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… అప్పటి లావాదేవీలో చోటుచేసుకున్న వాస్తవాలను వెలికితీయాలంటూ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. 2009లో సింధియాల నుంచి తాను మహల్గావ్ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశానని తన తాజా ఫిర్యాదులో శ్రీవాస్తవ తెలిపారు. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్నదానికంటే 6 వేల చదరపు అడుగులు స్థలం తక్కువగా ఉందని ఆయన చెప్పారు. తప్పుడు పత్రాలతో తనకు భూమిని అమ్మారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి 2014 మార్చి 26న సింధియాలపై ఆయన తొలిసారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు 2018లో కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన ఫిర్యాదు చేయడంతో… కేసును మళ్లీ ఓపెన్ చేసినట్టు సదరు అధికారి వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/