కరోనా కాటు… 450కి చేరిన మృతులు

24 దేశాలకు విస్తరించిన కరోనా

Coronavirus
Coronavirus

బీజింగ్‌: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలల్లో వణుకుపుట్టిస్తుంది. ఈ కరోనా కాటుకు ఇప్పటివరకూ 450 మందికి పైగానే మరణించినట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి. నిన్న సోమవారం ఒక్కరోజే మరో 3,500 మందికి వైరస్ సోకినట్టు అధికారులు నిర్దారించారు. వీరందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మొత్తంగా దాదాపు 20 వేల మందికి పైగా వైరస్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. వీరిలో 400 మంది వరకూ డిశ్చార్జ్ చేసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. మిగతా వారంతా వైరస్ తో బాధపడుతున్నారని, వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించింది. ఎన్నో దేశాలు విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను పెట్టాయి. ఇండియాకు చైనా నుంచి వస్తున్న వారిని రెండు వారాల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని నిర్ణయించిన కేంద్రం న్యూఢిల్లీల్లో ప్రత్యేక వార్డులను సైన్యం పర్యవేక్షణలో నిర్మించిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారందరినీ అక్కడికి తరలించి, 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి, వారిలో వైరస్ లేదని తేలిన తరువాత మాత్రమే బాహ్య ప్రపంచంలోకి పంపుతున్నారు.

కేరళ ప్రభుత్వం స్టేట్ హై అలర్ట్ ను ఇప్పటికే ప్రకటించింది. దేశంలో మూడో కరోనా కేసు వెలుగులోకి రాగా, వారి కుటుంబీకులందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించారు. హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రితో పాటు గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ నిర్దారణ కోసం ప్రత్యేక కిట్లను తెప్పించారు. గడచిన 10 రోజుల్లో దాదాపు 60 మంది అనుమానితులను పరిశీలించిన వైద్యులు, వారిలో 9 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేల్చి, వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ఇంతవరకూ తెలంగాణలో కరోనా ఎవరికీ సోకలేదని అధికారులు అంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/