ఈరోజు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం..

ఈరోజు బుధువారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాల అమలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్‌ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్‌. పాత పింఛను పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే 50% పింఛనుకు తగ్గకుండా.. అలాగే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కొద్దికాలంగా ఏపీ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్న విషయం విధితమే. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేలా కేబినెట్ లో నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. సీపీఎస్ రద్దు చేసి కొత్త విధానం తీసుకువచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా కేబినెట్ లో నిర్ణయం ఉంటుందని సమాచారం. అదేజరిగితే సుమారు 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది.

పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వేల కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయడం, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.