భారత్‌ పర్యటన పై స్పందించిన ట్రంప్‌

భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈనెల 24, 25 తేదీల్లో పర్యటించబోతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ.. భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. తన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరగబోతున్నాయనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ప్రధాని మోడి గొప్ప జంటిల్మన్ అని కితాబిచ్చారు. అమెరికాతో కలసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోందని… అవసరమైన అన్ని ఒప్పందాలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని… భారత్ లో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.

గత ఏడాది అమెరికాలో మోడి పర్యటించినప్పుడు హ్యూస్టన్ స్టేడియంలో భారీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది ఇండోఅమెరికన్లు వచ్చిన ఆ సభకు ట్రంప్ కూడా హాజరయ్యారు. దీనిపై ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. 50 వేల మంది మాత్రమే రావడం తనకు తృప్తిని కలిగించలేదని… అందుకే, అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్ట్ నుంచి స్టేడియం వరకు తనకు, మోడికి కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని చెప్పారు. ‘మీకు తెలుసు… ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్ స్టేడియం. మోడి దాన్ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అది’ అని వ్యాఖ్యానించారు. నిన్ననే మోదీతో తాను మాట్లాడానని… తన ఇండియా పర్యటనపై ఇరువురం చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్ లో తనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది ఆతృతగా ఉన్నారని మోడి తనతో చెప్పారని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/