యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

యాదాద్రి: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా యాదగిరిగుట్ట (యాదాద్రి) ఆలయానికి వెళ్లే రెండో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

మరోవైపు ప్రమాదం నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా కొండపైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి కొత్త రోడ్డును నిర్మించారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలను సరిగా పాటించకపోవడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై కొండ చరియలు విరిగిపడుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/