లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిలు మంజూరు
ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. డొరండ ట్రెజరీ కేసులో సీబీఐ ఆయనకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లూలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో పాటు సగం శిక్షా కాలం జైల్లో గడపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లూలుకు ఊరటను కలిగించిందని తెలిపారు. రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.
కాగా, పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా తేలగా ఐదో, తుది కేసులోనూ ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవిభక్త బిహార్లో ప్రభుత్వ ట్రెజరీల నుంచి అక్రమంగా విత్డ్రాయల్స్ జరిగిన ఈ కేసులో రూ 950 కోట్లు చేతులు మారాయి. పశుగ్రాస కేసుల్లో లాలూ ప్రసాద్కు 14 ఏండ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించగా నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. 1996లో పశుగ్రాస కేసు వెలుగుచూడగా జూన్ 1997లో లాలూను సీబీఐ నిందితుడిగా చేర్చింది. లాలూతో పాటు బిహార్ మాజీ సీఎం జగన్నాధ్ మిశ్రాలపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/