నిరుద్యోగ దీక్ష..డ‌బ్బులు ఇవ్వ‌ట్లేరు కూలీల ఆందోళ‌న‌

మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో నిరుద్యోగ దీక్షకు ఏర్పాట్లు
రూ.400 చొప్పున ఇస్తామంటే వ‌చ్చామ‌ని వ్యాఖ్య‌లు

హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు షర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమె ప‌లువురితో క‌లిసి ఈ దీక్షలు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఆమె ఈ రోజు మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో నిరుద్యోగ దీక్ష చేప‌ట్టాల‌ని భావించారు.

అయితే, పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షలో పాల్గొన‌డానికి వైఎస్సార్‌టీపీ నేత‌లు అడ్డాకూలీలను ఇప్ప‌టికే తీసుకొచ్చారు. అయితే, దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసనకు దిగారు.

దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని తెలిపారు. త‌మ కూలీ త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు తాను తెలంగాణ‌లో నిరుద్యోగుల కోసం పోరాడుతూనే ఉంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. పోలీసులు ఈ రోజు ష‌ర్మిల‌ దీక్ష‌చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమె నిరుద్యోగ దీక్ష ఎలా కొన‌సాగిస్తార‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/