కవితకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లిన కెటిఆర్

రెండు రోజుల పాటు ఢిల్లీలోనే కెటిఆర్

ktr-went-to-delhi-in-support-of-kavitha

న్యూఢిల్లీః లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచడమే కాక… 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. తన లాయర్ తో కలిసి కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, లిక్కర్ వ్యాపారి రామచంద్రపిళ్లైతో కలిపి ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం.

ఇంకోవైపు, ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసంలో కవిత బస చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు జాగృతి కార్యకర్తలకు ఆమె అల్పాహార విందు ఇచ్చారు. మరోవైపు తన చెల్లెలికి తోడుగా ఉండేందుకు కెటిఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. కవితకు మద్దతుగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. కవిత కోసం ఈడీ అధికారులు 26 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.