నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఫై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఫై కేటీఆర్ ట్వీట్ చేసారు. త్వరలోనే సీఎం కేసీఆర్​ సచివాలయాన్ని ప్రారంభిస్తారని అలాగే తెలంగాణ అమరవీరుల స్మారకం ఏర్పాటు చేయనున్నారని కేటీఆర్ కేటీఆర్ ట్వీట్ చేసారు. అంతే కాదు 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.

ఇక నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుం​డా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మధ్యనే సెక్రటేరియట్ లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు.