ప్రతిపక్ష పార్టీలకు ఏం పనిలేకే వ్యాఖ్యలు: కేటీఆర్
తెలంగాణ పథకాలు దేశానికే దిక్సూచి..మంత్రి కేటీఆర్
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్లో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్పై ఆయా పార్టీల నేతలు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు ఏం పనిలేకే సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న గొప్ప సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని చెప్పుకొచ్చారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పేదలు అందరికీ తాము డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టేవారని ఆయన చెప్పారు.
ఈ ఇళ్లు ప్రైవేటు బిల్డర్ కడితే రూ.20 నుంచి రూ. 25 లక్షల మధ్య ఖర్చు అయ్యేదని ఆయన అన్నారు. తాము రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉండే అందరికీ చెబుతున్నానని, కేసీఆర్ మొండి మనిషి అని, ఆయన ఏ పని చేపట్టినా పూర్తయ్యేదాకా వదలరని చెప్పారు. ప్రతి పేద వ్యక్తికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తారని అన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/