బండి సంజయ్ కి నోటీసులు పంపిన కేటీఆర్..

KTR sends legal notice to Bandi Sanjay
KTR sends legal notice to Bandi Sanjay

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈ నెల 11వ తేదీన ట్విట్టర్‌‌లో మంత్రి కేటీఆర్‌‌పై నిరాధారమైన ఆరోపణలు చేశారని, దీనిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తరుపు న్యాయవాది నోటీసు లో పేర్కొన్నారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని మంత్రి కేటీఆర్ నోటీసుల్లో హెచ్చరించారు. 2019లో ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు మే 13వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ నోటీసులు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే బండి సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు. కేటీఆర్ ప‌రువుకు భంగం క‌లిగించేలా, అస‌త్య‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్.. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం కేటీఆర్‌కు ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 48 గంట‌ల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని న్యాయ‌వాది డిమాండ్ చేశారు.