రూపాయి పతనమవుతుంటే రేషన్ షాపుల్లో మోడీ ఫొటో : కేటీఆర్

కేంద్రంపై విమర్శలు గుప్పించిన కెటిఆర్

minister-ktr

హైదరాబాద్‌ః డాలరుతో తో పోలిస్తే రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన అంశంపై కేంద్రంలోని బిజెపి సర్కారును టార్గెట్ చేసిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ సెటైర్లు సంధించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన వరుస వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ.. గురువారం రికార్డు స్థాయిలో రూ.80కి పడిపోగా… తాజాగా శుక్రవారం ఉదయం ఆ విలువ మరింత పతనమై రూ.80.38కి పడిపోయింది.

ఈ స్థితిపై శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో కెటిఆర్ వరుసగా పోస్టులను పెట్టారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్న కెటిఆర్… అయినా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో కోసమే వెతుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లోనే రూపాయి విలువ పతనమైపోయిందని ఆమె చెబుతున్నారని కెటిఆర్ అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణమని చెబుతున్నారని ఆరోపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/