రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు – మంత్రి కేటీఆర్

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ నలుగురు మంత్రులు, ప్రభుత్వ సీఎస్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భాంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..గ్రూప్1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో పెడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి 24 గంటలు నడిచేలా చేస్తామన్నారు. స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని.. 37 వేల ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగిందన్నారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత సాధించిందన్నారాయన. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్.. వన్ టైం రిజిస్ట్రేషన్ తీసుకు రావటం జరిగిందన్నారు. డిజిటల్ చెల్లింపులు.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని వివరించారు.

లీకేజీకి పాల్పడిన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వెనక ఎవ్వరు ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఇద్దరి వెనుక ఎవ్వరు ఉన్నా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిట్ ప్రాధమిక దర్యాప్తు మేరకు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అన్నారు. వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని, హ్యాకింగ్ జరగలేదని స్పష్టం చేశారు. కానీ, కొంతమంది విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి వలలో పడవద్దని యువతకు కేటీఆర్ సూచించారు. ఈ కేసులో అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అన్నారు. లీకేజే వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నది తేల్చాలని డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.