ఆయన కుటుంబానికి అండ‌గా ఉంటాం..కెటిఆర్

జమ్మూకశ్మీర్‌లో నిన్న జరిగిన కాల్పుల్లో మహేశ్‌ మృతి

minister-ktr

హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో నిన్న ఉగ్రవాదుపై ఎదురుకాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందారు. ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, పలువురు నేతలు నివాళుల‌ర్పించారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి మ‌హేశ్‌ చేసిన త్యాగం మరువలేనిదని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆయనకు తెలంగాణ నివాళి అర్పిస్తుందని చెప్పారు. మ‌హేశ్ త్యాగం మ‌రువ‌లేనిదని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని కెటిఆర్‌ అన్నారు.

‘ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ కు ఘన నివాళి‌. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

భార‌తావ‌ని కోసం మ‌హేశ్ చేసిన త్యాగం మ‌రువ‌లేనిద‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. అమ‌ర సైనికుడికి యావ‌త్ తెలంగాణ నివాళుల‌ర్పిస్తున్న‌ద‌ని చెప్పారు. ‘మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేం’ అ‌ని డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/