బండి సంజయ్…రేవంత్ రెడ్డి లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

TSPSC పేపర్ లీకేజీ వ్యవహరంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అపత్రిష్ఠపాలు చేస్తున్నందుకు వీరిద్దరికి నోటీసులు పంపుతున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తు చేశారు.

అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ తెరలేపారని కేటీఆర్ అన్నారు. ఒక దురదృష్ట సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. మతిలేని రాజకీయ ఉచ్చులో పడి యవత చిక్కుకొవద్దని కేటీఆర్ తెలిపారు. ఉద్యోగాల ప్రిపరేషన్ ను కొనసాగించాలని యవతకు మంత్రి పిలుపునిచ్చారు.