హైదరాబాద్ తో అమెజాన్ సంస్థ బంధం బలపడుతూనే ఉందిః మంత్రి కెటిఆర్
హైదరాబాద్లో అమెజాన్ ఎయిర్ను ప్రారంభించిన కెటిఆర్
హైదరబాద్ః హైదరాబాద్ తో అమెజాన్ సంస్థ బంధం బలపడుతూనే ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్ను కెటిఆర్ ప్రారంభించారు. అమెరికా, యూరోప్ అవతల అమెజాన్ ఎయిర్ తొలి సర్వీస్ ఇదే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెజాన్ ఎయిర్ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప క్షణమని అన్నారు.
అమెజాన్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తో అమెజాన్ బృందాన్ని అభినందించారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లోనే ఉందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. అసియాలో అమెజాన్ అతి పెద్ద ఫుల్ఫిల్ మెంటర్ కూడా భాగ్యనగరంలో ఉందన్న కెటిఆర్.. ఇప్పుడు అమెజాన్ ఎయిర్ ప్రారంభించిందన్నారు.
ఇక, ప్రగతిశీల చర్యల వల్ల తెలంగాణలో ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్సిటీ అవార్డును సొంతం చేసుకుందని తెలిపారు. గత ఏడేళ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని కెటిఆర్ వెల్లడించారు. అమెజాన్.. తెలంగాణ చేనేత శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 56 గ్రామాల్లో 4500 మంది నేత కార్మికులకు సహాయం చేస్తోందని వెల్లడించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/