ఉచిత పథకాలు వద్దన్న మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్

KTR tweet to Modi
ktr fires on modi freebies comments

ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదల పథకాలపై మోడీకి ఎందుకంత అక్కసు అంటూ మండిపడ్డారు. పేదవాడి పొట్టకొట్టేందుకు కేంద్రం కొత్త పాచిక ఈ ఉచిత పథకాలపై చర్చ అని విమర్శించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటీ?.. బడుగు బలహీన వర్గాల ప్రజలే మీ టార్గెటా?.. పేదలకు ఇస్తే ఉచితాలా?.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అంటూ ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా?, రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్‌ రుణమాఫీ ముద్దా?.. అని ఆరోపించారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్‌కు పన్నురాయితీనా? అని నిలదీశారు. మీకు దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదన్నారు.

ఇటీవల మోడీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!. ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. మోడీ ప్రభుత్వం రూ.80లక్షలకోట్ల అప్పు తెచ్చిందని, ఈ అప్పు తెచ్చి ఎవరిని ఉద్దరించారని ప్రశ్నించారు. దేశ సంపదను పెంచే తెలివి మోడీ ప్రభుత్వానికి లేదని, సంపద పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు లేదన్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. కేంద్రం జీడీపీలో 40శాతానికి మంచి అప్పులు చేయకూడదని, మోడీ సర్కారు ఈ విషయంలో 54శాతం అప్పులు చేసిందని కాగ్‌ తలంటిందన్నారు. పరిస్థితి ఇలాగేపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించిందని అన్నారు. ఇంత సొమ్ము అప్పుగా తెచ్చి మోడీ ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టిండ్రా?.. మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా?.. పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా? అని నిలదీశారు. ఇవేవీ చేయనప్పుడు ఇన్నిలక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరాయో మోడీనే చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేసారు.