వ‌రి కొనుగోలు విషయంలో బీజేపీ మెడలు వంచుతాం – కేటీఆర్

రాష్ట్రంలో రైతులు పండించి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్రమంతా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. నియోజకవరాల్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. జిల్లా కేంద్రాల్లో మంత్రులు నిరసనలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మ‌హా ధ‌ర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ..కేంద్రం యాసంగి వడ్లు కొంటామ‌నే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడ‌లు వంచాము.. వ‌రి కొనుగోలు కోసం బీజేపీ మెడ‌లు వంచ‌లేమా అని కేటీఆర్ అన్నారు. రైతుల వెంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామ‌న్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎరువులు, విత్త‌నాల‌కు లైన్లు క‌ట్టే ప‌రిస్థితి లేదు. స‌కాలంలో రైతుల‌కు ఎరువులు, విత్త‌నాలు అందిస్తున్నాం. పాల‌కుల మ‌న‌సు బాగుంటే అన్ని బాగుంటాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. చెరువులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచుకున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తుంది. మ‌న రైతుబంధును కేంద్రం స‌హా 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయ‌న్నారు.