రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 47 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే వేడుకలను టిఆర్ఎస్ నేతలు జరుపుతున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా.. మంత్రి కేటీఆర్పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రం (స్యాండ్ ఆర్ట్), త్రీడీ ప్రదర్శ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఎంపీ కవితతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ కు భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రపంచపటంలో ఐటీ రంగానికి ఐకాన్ మంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తన్నారు. అలాంటి నాయకుడు అరుదని, నేటి యువతరానికి కేటీఆర్ ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కోటలో వేడుకలు నిర్వహించారు.