యశ్వంత్​ సిన్హా మద్దతు వెనుక ఎన్నో కారణాలున్నాయి : మంత్రి కేటీఆర్‌

ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శ

ktr-and-team-participates-in-yashwant-sinha-nomination-program

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లడుతూ..యశ్వంత్‌ సిన్హాకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించామని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గాల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బీజేపీ తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ.. విపక్షాల అభ్యర్థిని బలపరిచామని ప్రకటించారు. అయితే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలిపామని బీజేపీ చెబుతోందని.. వారిపై అంత ప్రేమ ఉంటే గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. ఇప్పటికీ దానిని ఆమోదించలేదని విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో పెట్టారని, ఇప్పటికీ దానికి అతీగతీ లేదని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/