కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

హైదరాబాద్ : హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరికాసేపట్లో ఆ పార్టీ నేతలకు లేఖను పంపనున్నారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్‌ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్‌ఎస్‌ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం నోటీస్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీని గురించి గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్‌ఎస్‌ తనకే టికెట్‌ ఇస్తుందని ఫోన్‌లో కౌశిక్‌ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్‌ వైరలైన సంగతి తెలిసిందే. ఆడియో టేపుల వ్యవహారంపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆలోపే తన రాజీనామాను ప్రకటించారు కౌశిక్ రెడ్డి. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/