ఆర్జీవీ దేవుడు పంపిన దూత – కొండా సురేఖ

కాంగ్రెస్ నేత కొండా సురేఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫై ప్రశంసలు కురిపించింది. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండటం, ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించడం రామ్ గోపాల్ వర్మ నైజం. అందుకే ఎప్పుడు చూసినా సామజిక మాధ్యమాల్లో, వార్తా పత్రికల్లో రామ్ గోపాల్ వర్మ పేరు నానుతూనే ఉంటుంది. అలాంటి వర్మ వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీ- సురేఖల జీవిత కథ ఆధారంగా కొండా పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి అయ్యి , రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా ‌పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం’ అని పేర్కొన్నారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను’ అని తెలిపారు. ఈ సందర్బంగా కొండా సురేఖ విజయవాడలోని కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కొండా సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చాము. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో టూర్ ప్రారంభించాం. వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం. వైఎస్సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం అని తెలిపారు.