స్పీకర్‌కు రాజీనామా లేఖ అందజేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​

Komatireddy Rajagopal Reddy handed over his resignation letter to the Speaker

హైదరాబాద్‌ః మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. తన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్​పార్కుకు చేరుకున్న రాజగోపాల్​ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించానని, తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు రాజగోపాలరెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని.. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడని.. సీఎం అవుతారంట అని వ్యాఖ్యానించారు.‘’డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం చేయకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలి’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/