తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవా?
రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించి అధిష్ఠానం తప్పు చేసింది: కోమటిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఆయనకు ఆ పదవిని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని సూటిగా ప్రశ్నించారు. సీఎల్పీలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని ఆయనకు ఎలా ఇస్తారని నిలదీశారు. పార్టీనే నమ్ముకున్న వారి గతేం కావాలంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధిష్ఠానం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పదవిని అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ తీవ్రంగా దెబ్బతినడం ఖాయమని అన్నారు. తొలి నుంచి తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇచ్చారని వాపోయారు. నిజానికి అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానం ముందే నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత మాత్రం అందరి అభిప్రాయాలు తీసుకున్నట్టు నటించిందని విమర్శించారు. రేవంత్రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కానీ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం జరుగుతుందన్నదే తన బాధ అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/