151 సీట్లు మళ్లీ పక్కాగా వస్తాయి : కొడాలి నాని

పనీపాట లేక చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారని వ్యాఖ్య 


అమరావతి: జగన్ జీవించి ఉన్నంత కాలం ఆయన సీఎంగా ఉండాలని గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని నాని అన్నారు. జగన్ కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని అన్నారు. జగన్ సీఎం అయ్యుండకపోతే పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండే వారని చెప్పారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినం సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా 2024 ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. గుడివాడ 22వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు పనీపాట లేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ నెరవేర్చిన వైస్సార్సీపీ కి ప్రజా అనుకూల ఓటు మాత్రమే ఉందని చెప్పారు. తమ 151 సీట్లు తమకు మళ్లీ పక్కాగా వస్తాయని అన్నారు. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/