టీడీపీకి కొడాలి నాని సవాల్ ..

టీడీపీ పార్టీ కి వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. ఏపీలో జగన్ గ్రాఫ్ తగ్గుతుందని టీడీపీ చేస్తున్న ప్రచారం ఫై నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..సవాల్ విసిరారు. ‘కుప్పంలో చంద్ర‌బాబుతో రాజీనామా చేయించి మ‌ళ్లీ పోటీ చేయించి గెలవ‌మ‌ని స‌వాల్ విసురుతున్నాను’ అంటూ ఆయ‌న టీడీపీకి స‌వాల్ విసిరారు. అంతేకాకుండా కుప్పంలో చంద్ర‌బాబు రాజీనామా త‌ర్వాత ఆయ‌న పోటీ చేసినా, లేదంటే ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ పోటీ చేసినా త‌మ‌కు ఓకేనంటూ నాని స‌వాల్ విసిరారు. బోగ‌స్ స‌ర్వే చూసుకుని మురిసిపోతున్న దుష్ట‌చ‌తుష్ట‌యానికి, దాన్ని అచ్చేసిన మీడియాకి ఓపెన్ చాలెంజ్ చేసారు.

అలాగే ఎమ్మెల్యే పేర్ని నాని సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉంది. టీడీపీకి రాజ‌కీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోని సంస్థ వైసీపీకి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు ఇవ్వ‌కుండా మ‌రెలా ఇస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ ద్వారా టీడీపీ గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారు. కానీ, అలా జరగలేదు. తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్‌ లేవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది. దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు. మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్‌ సర్వేను బయటకు వదిలారని నాని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్వేలు జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఏమీ చేయ‌లేవ‌న్న నాని.. జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని అన్నారు.