ESI ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని ఇవ్వాలంటూ కేసీఆర్ కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..సీఎం కేసీఆర్ కు లేఖ రాసారు. ఇక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తే ఎంతో మంది రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేసినా భూ కేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆసుపత్రికి ఐదు ఎకరాల భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలకు కూడా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించడానికి కేంద్ర కార్మిక శాఖ ఎన్నో చర్యలు చెపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో కీలకమైన రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐ ) 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించింది. ఆ మేరకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐ ) కేంద్ర కార్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ 20.09.2018 న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ESIC ప్రాంతీయ కార్యాలయం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే భూమి కేటాయించాలని ఉత్తరాల ద్వారా కోరింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు.