8 సీట్లతో సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌ రెడ్డి

ఎంఐఎం బలోపేతం కోసమే కెసిఆర్ జాతీయ పార్టీ.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

union-minister-kishan-reddy-comments-on-cm-kcr

హైదరాబాద్‌ః కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సోమవారం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో టిఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ విమర్శలు గుప్పించారు. ఎంఐఎం బలోపేతం కోసమే కెసిఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారంటూ ఆరోపించారు. వ్యతిరేక భావనతో వచ్చే ఏ పార్టీకీ మనుగడ ఉండదంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్రపక్షం మజ్లిస్‌ అని.. కెసిఆర్‌ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో ఆ పార్టీ నేతలకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేదే కెసిఆర్‌ ఆలోచన అని తెలిపారు. సీఎం కెసిఆర్ ఫాంహౌస్‌లో కలలు కంటున్నారంటూ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మునుగోడు అభివృద్ధి కోసమే ఈ ఉప ఎన్నికలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఈ కొద్ది రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎవరూ నిలిచినా మునుగోడులో విజయం బిజెపిదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో టిఆర్ఎస్‌కు భవిష్యత్‌ ఉండదని.. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టిఆర్ఎస్ కలిసి కుట్ర చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ సానుభూతి పరులంతా కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని.. వాళ్ల మనస్సంతా మోడీపైనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబ పాలనకు రిఫరెండమ్ అని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/