లఖింపూర్ ఖేరీ ఘటన ఓ ప్రణాళికాబద్ద కుట్ర: సిట్
దేశంలో సంచలనం సృష్టించిన లఖింపూర్ ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ వద్ద ఓ రైతులపై ఓ ఎస్ యూవీ వాహనం దూసుకుపోగా, నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది మృత్యువాతపడడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేడు తన నివేదికను కోర్టుకు సమర్పించింది.
రైతులను చంపాలన్న పక్కా ప్రణాళికతోనే వాహనం నడిపారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇదేమీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘటన కాదని, రైతులను చంపేందుకు కుట్ర పన్నారని వివరించింది. కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా సహా 13 మంది నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. గతంలో నిందితులపై దురుసుగా వాహనం నడిపారన్న అభియోగాలు నమోదు కాగా, వాటిని సవరించేందుకు వీలు కల్పించాలని సిట్ విజ్ఞప్తి చేసింది. గత అక్టోబరు 3న లఖింపూర్ లో జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతులు, మరో నలుగురు ఇతరులు మరణించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/