నేడు మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
3 గంటలకు గణేషుడి శోభాయాత్ర ప్రారంభం
హైదరాబాద్: నేడు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్లోని క్రేన్ నెం.4 దగ్గర గణేశుడి నిమజ్జనం కానుంది. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం కూడా నిర్వహించడం లేదని ఇప్పటికే నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే మంగళవారం భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కాగా.. చివరి రోజు మంగళవారం జరిగే విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ నిమజ్జనం జరుగునుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/