గుండెపోటు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసు సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. అప్పటివరకు హ్యాపీగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణిస్తున్నారు. ముఖ్యముగా యువత ఎక్కువ సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. అలాగే, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమెటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పబ్లిక్ ప్లేస్లలో ఏర్పాటుచేసేందుకు 1400 పరికరాలకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్ యాక్సెస్ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితులకు ఊపిరిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్లోనూ పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ ట్వీట్కు స్పందించిన కేటీఆర్.. మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్ ఇచ్చినట్టు ప్రకటించారు. వీటిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలవంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.